ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాబోయే సీజన్ కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. దక్షిణాది మరియు పశ్చిమ మండలాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించేందుకు బెంగళూరు వేదికగా ప్రత్యేక సెలక్షన్ క్యాంప్‌ను ఫ్రాంచైజీ ఏర్పాటు చేసింది.

ఈ ట్రయల్స్‌లో ముంబైకి చెందిన ఆయుష్ వర్తక్, అయాజ్ ఖాన్, దివ్యాంశ్ సక్సేనా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో 21 ఏళ్ల ఆల్‌రౌండర్ ఆయుష్ వర్తక్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్‌కు హాజరైనా కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోయాడు. నార్త్ ముంబై పాంథర్స్ తరఫున ఆయుష్ ప్రదర్శనను గమనించిన ఢిల్లీ యాజమాన్యం, ఇప్పుడు అతడిని పరిశీలిస్తోంది.

మిడిల్ ఆర్డర్ హిట్టర్ అయాజ్ ఖాన్, అండర్ 19 మాజీ స్టార్ దివ్యాంశ్ సక్సేనా కూడా ఈ క్యాంప్‌లో కీలకంగా మారారు. ముంబై టీ20 లీగ్‌లో 174 స్ట్రైక్ రేట్‌తో రాణించిన వీరిద్దరిని మినీ వేలంలో కొనుగోలు చేయాలని ఢిల్లీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గత సీజన్‌లో కేఎల్ రాహుల్ మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఫినిషర్ల కోసం జట్టు వేట సాగిస్తోంది.

రిషభ్ పంత్‌ను తిరిగి దక్కించుకోవడానికి కుల్దీప్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌కు పంపిన ఢిల్లీ, ఇప్పుడు జట్టులో ఖాళీ అయిన స్పిన్నర్ స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరంలో ఉంది. ఈ ట్రయల్స్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలించి, రాబోయే వేలంలో వారిని దక్కించుకోవడం ద్వారా జట్టును బలోపేతం చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యంగా పెట్టుకుంది.